http://www.eenadu.net/nri/nri.aspx?item=nri-news&no=45
ఇంటర్నెట్డెస్క్, హైదరాబాద్: తెలుగును ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా మార్చాలని కోరుతూ సిలికానాంధ్ర మనబడి ఇటీవల ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. కాలిఫోర్నియా లోని సిలికానాంధ్ర మనబడి ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘గోల్డెన్ గేట్ రిలే’లో భాగంగా వెంకటబట్టరం నాయకత్వంలో వీరగుండు, భవనీలకంఠ కెప్టెన్లుగా 24 మంది మనబడి విద్యార్థులు రెండు బృందాలుగా ఏర్పడి కలిస్తోగా నగరం నుంచి శాంటక్రూజ్ వరకు పరుగును నిర్వహించారు. రెండు బృందాలు 33 గంటల్లో ఆ లక్ష్యాన్ని అధిగమించారు. పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దారి పొడవునా తెలుగువారు అభినందించారు. ఈ సందర్భంగా మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ… భాషా సేవయే భావి తరాలకు సేవ అని వ్యాఖ్యానించారు. 20 మంది విద్యార్థులతో ప్రారంభమైన మనబడి కార్యక్రమం ప్రస్తుతం 6000 మంది విద్యార్థులతో పలు దేశాల్లో విస్తరించిందని తెలిపారు. అనంతరం మనబడి బృందంలోని స్నేహ వేదుల మాట్లాడుతూ… మనబడి ద్వారా తెలుగుభాష బోధనతోపాటు సాంస్కృతికోత్సవం, తెలుగు మాట్లాట, వంటి కార్యక్రమాలతో చిన్నారుల్లో స్ఫూర్తినింపిందని, తెలుగు పరుగుతో మరింత మందికి చేరువవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ పరుగులో పాల్గొన్న జయచంద్ర, ప్రశాంత్ ఘట్టమనేని, అనురాధిక కందుల, సుబ్బలక్ష్మి, విశాల్, హర్ష నాగరాజు, రాజరామన్, భావనీలకంఠి, శివరాం చామిరాజు, అరవింద్ శ్రీనివాసన్, తారనీలకంఠి, సతీష్ ఆనందనారాయణ, వీరగుండు, వెంకట బట్టరం, కిషోర్ వారణాసి, రాజు చామర్తి, సత్య, మధు తదితరులకు అభినందనలు తెలిపారు.